ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలి
గిరిజన , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
మక్కువ , జయజయహే: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు అమలు చేయడంలో అధికారులు పారదర్శకత పాటించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం నాడు మక్కువ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పనులు అమలు తీరుపై అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో పథకాలు అమలు చేయడంలో అధికారులు పారదర్శకత పాటించాలని సూచించారు. ముఖ్యంగా పల్లె ప్రగతి, హరిత హారం, సముదాయ శుభ్రత, నీటి సరఫరా, పింఛన్ల పంపిణీ, గృహ నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, పాఠశాలల ఆధునీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అవసరాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు అమలులోకి రావాలని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల నాణ్యతపై మంత్రి అధికారులను ప్రశ్నించడంతో పాటు పర్యవేక్షణ పెంచాలని, వాస్తవ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మండలంలో చేపట్టిన ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సమయపాలనతో కూడిన కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి పరంగా ముందుకు సాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి డిడి స్వరూపరాణి , తాహాశీల్దార్ షేక్ ఇబ్రహీం పాల్గొన్నారు .


