చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇకపై నెలలో 15 రోజులపాటు ఈ నిత్యావసర సరుకులను రేషన్ కార్డుదారులకు అందజేయనుంది. ఈ 15 రోజుల పాటు కూడా రెండు పూటలా పంపిణీ ఉంటుంది. ఈ మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు చేర్పులను చేపట్టింది. ఈ నెల నుంచే ఇవి అమలులోకి రానున్నాయి.
ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. పేదలకు అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మూసివేతకు గురయ్యాయని ఆరోపించారు. నిత్యావసర సరుకులను ఇంటింటికీ సరఫరా చేస్తామని 1,600 కోట్ల రూపాయలతో వాహనాలు కొనుగోలు చేసిందని ధ్వజమెత్తారు. ఆయా వాహనాల ద్వారా ఇంటింటికి సరుకులను ఇవ్వడం మానేసి నెలలో ఒకట్రెండు రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడం వల్ల ఎంతోమంది పేదలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. కార్డుదారులకు అందజేయకుండా మిగిలిపోయిన రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అక్రమంగా తరలిస్తోన్న విషయంపై తమ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని, వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

