వల్లభనేని వంశీకి హైకోర్టులో రిలీఫ్ దక్కింది. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా వంశీ తనకు మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి లో సరైన సౌకర్యాలు లేవని కోర్టుకు నివేదించారు. దీంతో, వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణాజిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. గతంలోనే ఈ పిటీషన్ పైన విచారణ చేసిన న్యాయ స్థానం ఈ రోజుకు వాయిదా వేసింది. పీటీ వారెంట్ అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులనూ ఈ రోజు వరకు పొడిగించింది. కాగా, ఈ రోజు విచారణ తరువాత వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు అయినా.. వంశీ బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఇతర కేసుల్లో వంశీ రిమాండ్ లో ఉన్నారు. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ పోలీసు కస్టడీ ఎదుర్కొన్నారు. కాగా, వంశీకి చికిత్స విషయంలోనూ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
కొంత కాలంగా వంశీ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పలు మార్లు విజయవాడ ఆస్పత్రిలో వంశీ కి చికిత్స అందించారు. తాజాగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వంశీకి చికిత్స చేసారు. అక్కడ పరీక్షలు నిర్వహించారు. న్యూరాలజీ, పల్మనాలజీ సమస్యలతో వంశీ బాధ పడుతున్నట్లు గుర్తించి మందులు ఇచ్చారు. కాగా, చేయాల్సిన పరీక్షల గురించి వైద్యులు వివరించారు. కాగా, హైకోర్టులో వంశీ తన అనారోగ్య కారణాలను వివరిస్తూ.. ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్సకు అనుమతి ఇవ్వాలని కోర్టను కోరారు. ఈ మేరకు పిటీషన్ దాఖలు చేయగా.. కోర్టు విచారణ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స సరిగ్గా లేదని కోర్టుకు నివేదించారు. దీంతో, వంశీకి ఎక్కడ చికిత్స అందిస్తారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. కోర్టుకు నివేదించిన తరువాత వంశీని చికిత్స కోసం తరలించే అవకాశం ఉంది.

