ఆధారాలు, సాక్ష్యాలు ఎవరివైపు ఉంటే వారివైపు న్యాయస్థానాలు తీర్పులు చెప్తాయన్న విమర్శలకు చెక్ పెట్టేలా దేశ అత్యున్నన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ ఓ అరుదైన తీర్పు వెలువరించింది. ఎప్పుడూ చట్ట ప్రకారం మాత్రమే తీర్పులు ఇచ్చే సుప్రీంకోర్టు ఇవాళ మాత్రం మనసుతో ఆలోచించి ఓ అరుదైన కేసులో అంతే అరుదైన తీర్పు వెలువరించింది. అంతే కాదు ఇదో కనువిప్పు కావాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
2018లో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై అప్పట్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని కాపురం కూడా చేసుకుంటున్నాడు. అయినా గతంలో చేసిన తప్పిదానికి పోక్సో చట్టం ప్రకారం అతన్ని దోషిగా తేల్చారు. కానీ ఆ బాధితురాలు మాత్రం తన భర్తను కాపాడాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సమగ్రంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. తన అసాధారణ అధికారం వాడాలని నిర్ణయించింది.
పోక్సో కేసులో దోషిగా తేలిన ఆ వ్యక్తికి ఇవాళ విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోక్సో చట్టం కింద అతనిపై నమోదైన అభియోగాలపై అతనికి శిక్ష విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి దోషికి ఉపశమనం కల్పించింది. అంతే కాదు ఈ కేసు అందరికీ కనువిప్పు కావాలని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. గతంలో జరిగిన ఘటనను బాధితురాలు దారుణమైన నేరంగా పరిగణించనప్పటికీ ఆమె మాత్రం దాని కారణంగా బాధపడినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే అప్పట్లో మన న్యాయవ్యవస్ధలో, ఆమె కుటుంబంలో ఉన్న లోపాల కారణంగా ఆమె సరైన నిర్ణయం తీసుకోలేక అతన్నే పెళ్లి చేసుకుందని కోర్టు తెలిపింది. అలా ఒక బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు తన భర్త , కుటుంబాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని సుప్రీం పేర్కొంది. కాబట్టి అన్ని పరిస్ధితుల్ని పరిగణనలోకి తీసుకుని ఈ చారిత్రక తీర్పు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.


