Amit Shah Tweet: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం అని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, మే 21: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై (Chhattisgarh Encounter) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) స్పందించారు. ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు (Nambala Keshava Rao) మృతి చెందాడంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. మావోలపై మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత చనిపోవడం ఇదే ప్రథమమన్నారు. ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టుల (Maoists) మృతి చెందారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో తెలియజేశారు.
అమిత్ ట్వీట్ ఇదే
నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం. ఈరోజు, ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్లో జరిగిన ఆపరేషన్లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. సీపీఐ – మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. మావోయిస్టులను హతమార్చిన మన ధైర్యవంతులైన భద్రతా దళాలు , ఏజెన్సీలను అభినందిస్తున్నాను. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్టు, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలియజేయడం సంతోషంగా ఉంది. మార్చి 31, 2026లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.
కాగా.. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే మరికొంత మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతిచెందాడు. 1955లో శ్రీకాకుళం జిల్లా జీఅన్న పేటలో కేశవరావు జన్మించారు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొని, రాడికల్స్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడిగా పనిచేశారు. 1980లో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన తర్వాత స్వగ్రామాన్ని వదిలి నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు నంబాల.1980లో ఏర్పడిన సీపీఐ పీపుల్స్ వార్ గ్రూప్లో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నారు.
1987లో అంబుష్ వ్యూహాలు, పేలుడు పదార్థాల వినియోగంపై శిక్షిణ పొందారు. 2004లో సీపీఐ పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన మావోయిస్టు పార్టీకి కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ 10న ముప్పల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి రాజీనామా చేసిన తర్వాత నంబాల కేశవ్ రావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు, పేలుడు పదార్థాల వినియోగంలో నంబాల నిపుణుడు. నంబాలపై ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయి. భద్రతా దళాలపై జరిగిన పలు ప్రధాన మావోయిస్టు దాడుల్లో నంబాల పాత్ర కీలకం. నంబాల కేశవరావుపై ఒక కోటి రివార్డు కూడా ఉంది. నంబాల భార్య కూడా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నారు.
Post
Conversation
![]()

