పనులు రీలాంఛ్ చేయనున్నప్రధాని మోడీ
అమరావతిలో పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు
రూ. 49వేల 40 కోట్ల పనులకు శంకుస్థాపనలు
పలు ప్రాజెక్టులు మోడీ చేతుల మీదుగా ప్రారంభం
నిరంతరం పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు
జయజయహే : రాజధాని అమరావతి రీలాంచ్కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అమరావతిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మోదీ టూర్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అటు.. అమరావతిలోని సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా హెలీపాడ్ నుంచి వేదిక వరకు కారులో నుంచే అభివాదం చేస్తూ గ్రౌండ్ దగ్గరకు చేరుకోనున్నారు. ఇప్పటికే.. ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రుల కమిటీ పర్యవేక్షిస్తోంది. దానిలో భాగంగా.. సభా వేదిక దగ్గర కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశమైంది. మోదీ సభ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ చర్చించారు. మోదీ సభ పర్యవేక్షణ అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎండాకాలం దృష్ట్యా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని.. మంచినీరు.. మజ్జిగ ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమ వేదికపై మొత్తం 14 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీతో పాటు.. గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు ఆశీనులు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు మూడు వేర్వేరు ప్రాంగణాలు ఏర్పాటు చేసినా.. వేదిక మాత్రం ఒక్కటే ఉండనుంది. వేదిక ఎదురుగా అమరావతి రైతులకు ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇక.. అమరావతి పర్యటనలో 49వేల 40 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు భూమి చేస్తారు. అలాగే.. పలు జాతీయ సంస్థలకు చెందిన 57వేల 962 ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఇదీ మోడీ షెడ్యూల్..
ప్రధాని మోదీ అమరావతి టూర్ షెడ్యూల్ ఖరారైంది. అమరావతి పున: ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి వస్తున్నారు. రేపు.. మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు మోదీ. ప్రధానికి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు. రాజధాని నిర్మాణంలో భాగంగా చేపడుతున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. మరోవైపు పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు చేపడుతోంది. రేపు వాటి ప్రారంభోత్సవాలు కూడా అమరావతి వేదిక మీద నుంచే చేస్తారు ప్రధాని మోదీ. ఓవరాల్గా ఒక గంటా 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు. షెడ్యూల్లోని కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత.. సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు తిరిగి హెలికాఫ్టర్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు.
ప్రారంభించే ప్రాజెక్టులివే…
రాజధాని నిర్మాణంలో భాగంగా 49వేల 40 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రాజెక్టులలో భాగంగా.. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలు ఉన్నాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. డీఆర్ డీఓ డీపీఐఐటీ, ఎన్ హె్చ ఏ ఐ , రైల్వేస్కు సంబంధించి.. దాదాపు 8 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్ల రూపాయలతో నిర్మించే మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్, విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్కు శంకుస్థాపన వర్చువల్గా ప్రధాని చేతుల మీదుగా జరుగుతుంది. ఇక.. గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన 293 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 3176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగానే వర్చువల్ పద్దతిలో శంకుస్థాపనలు జరుగుతాయి. ఇక.. 3వేల 680 కోట్ల రూపాయల విలువైన పలు నేషనల్ హైవే పనులను సైతం ఇదే వేదిక నుంచి ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. 254 కోట్ల రూపాయలతో నిర్మించిన ఖాజీపేట-విజయవాడ 3వ లైన్, గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, KUF పాణ్యం లైన్లను ప్రధాని ప్రారంభిస్తారు. ఓవరాల్గా.. 57వేల 962 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ.


