సచివాలయం వెనుక సభా వేదిక
అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం
నిరంతరం పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
వర్షం కురిసినా ఇబ్బంది లేదని స్పష్టీకరణ
జయజయహే : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు. రోడ్ షోతో పాటు బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను బుధవారం పురపాలక శాఖ మంత్రి నారాయణ , అధికారులు పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు. ఈ సాయంత్రానికి మొత్తం ఏర్పాట్లు పూర్తవుతాయని తెలిపారు. రవాణా, పార్కింగ్ ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. వర్షం వస్తే పార్కింగ్కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. దీనిపై పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగా చేశారన్నారు. ఈ సభకు 5 లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 6500 – 7000 బస్సులు, 3000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా నోడల్ అఫిసర్ వీర పాండ్యన్ మాట్లాడుతూ.. ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆహారం..మంచినీరు అన్ని బస్సు ల్లో అందిస్తామని తెలిపారు. సభా ప్రాంగణం లోకి వాటర్ బాటిల్ అనుమతించరని.. కేవలం సెల్ ఫోన్ ఒక్కటే అనుమతిస్తారని చెప్పారు. సభ జరిగే ప్రాంతంలో మంచి నీరు అందిస్తారని.. బాటిళ్లు తీసుకు రాకూడదని తెలిపారు. పార్కింగ్కు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని వీర పాండ్యన్ వెల్లడించారు. కాగా.. ప్రధాని మోదీ అమరావతి సభకు వచ్చేవారి కోసం ఇప్పటికే అధికారులు రూట్ మ్యాప్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సభకు చేరుకునేందుకు ఆరు మార్గాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా- గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి సభకు వచ్చేవారి కోసం 2400 బస్సుల ఏర్పాటు చేశారు. ఆరు చోట్ల ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కరకట్ట మీదగా సభా ప్రాంగణం వరకు వీఐపీ మార్గం కల్పించారు.వెస్ట్ బైపాస్ నుంచి కూడా సభా స్ధలికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యే వారికి, వీఐపీల కోసం వేరువేరుగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు.

