జయజయహే : ముంబై నటి కాదంబరీ జెత్వానీపై గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు అరెస్టు చేసి వేధించారని ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు ఇతర పోలీసు అధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబైలో ఓ పారిశ్రామికవేత్త పై ఆమె పెట్టిన రేప్ కేసును వెనక్కి తీసుకునేలా ఆమెను ఒప్పించేందుకు ఈ వేధింపుల ఎపిసోడ్ చేపట్టారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఇవాళ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను, తన కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేసి వేధించారంటూ నటి కాదంబరీ జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం ఐపీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటోంది. దీనిపై వారు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాతో పాటు ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు… వీరిపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. జెత్వానీ కేసులో నిందితులుగా ఉన్న వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో వీరికి భారీ ఊరట లభించినట్లయింది. అదే సమయంలో ఇదే కేసులో వీరు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్లపై ఈ నెల 30న తుది విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందులో వీరిపై ఆరోపణలు నిజం కాదని తేలితే కేసు పూర్తిగా కొట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వ వైఖరిపై ఆరోపణలు వచ్చాయి. ముంబై నటిని వేధించారన్న కేసులో ఐపీఎస్ లని కూడా చూడకుండా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం కాదంబరీ జెత్వానీపై గతంలో నమోదు చేసిన కేసును మాత్రం ఉపసంహరించుకోలేదు. దీని వెనుక కీలక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జెత్వానీ హోంమంత్రి అనితతో పాటు ప్రభుత్వ పెద్దల్ని కలిసి తనపై కేసు వెనక్కి తీసుకోవాలని కోరినా ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండిపోతోంది.



