SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 5:41 am Posted by : SHIVASURYA NEWS

హెచ్ ఓడి టవర్లకు టెండర్లు నాలుగు టవర్ల నిర్మాణానికి రూ. 1126 కోట్లు

అమరావతి :జయజయహే : రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన సచివాలయ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లను పిలిచింది. సచివాలయానికి 4 టవర్లు, హెచ్‌వోడీ కార్యాలయానికి ఒక టవర్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. హెచ్‌వోడీ టవర్‌ నిర్మాణానికి రూ.1,126 కోట్లకు టెండర్‌లను ఆహ్వానించింది. అలాగే సచివాలయం 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లకు, సచివాలయం 3, 4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు జారీ చేసింది. మొత్తం 5 టవర్లను రూ.4,668 కోట్ల వ్యయంతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 1న సచివాలయ, హెచ్‍వోడీ టవర్లకు టెక్నికల్ బిడ్లను సీఆర్డీఏ తెరువనుంది. సచివాలయంలో ఉండే హెచ్‌వోడీలకు సంబంధించి 45 అంతస్థులతో ఒక టవర్ నిర్మాణం, మిగతా టవర్లు 40 అంతస్థులతో నిర్మాణం జరుగనుంది. ఈ సచివాలయం టవర్లన్నీ కూడా డయాగ్రిడ్ స్టక్చర్‌తో నిర్మించాలని సీఆర్డీఏ టెండర్ షెడ్యూల్‌లో పేర్కొంది. ఈ టెండర్‌ రాజధాని నిర్మాణంలో సచివాలయ టవర్ల నిర్మాణమే అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు. ఈ సచివాలయ టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రెండున్నర సంవత్సరాల గడువు విధించారు.ఈ రెండున్నర సంవత్సరాల్లో వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకుతో పాటు, ఏడీబీ, హడ్కో, జర్మనీకి సంబంధించిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ రాజధాని అమరావతిలో పలు నిర్మాణాల కోసం రూ.31వేల కోట్లు రుణాలుగా సమకూర్చాయి. ప్రపంచ బ్యాంకుకు సంబంధించి ఇప్పటికే రూ.480 కోట్లు మొదటి విడత రుణం కూడా మంజూరు అయ్యింది. ఈ మొదటి విడత రుణంతోనే సచివాలయ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లను పిలిచింది.