SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 18 April 2025, 5:40 am Posted by : SHIVASURYA NEWS

వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం

జయజయహే : చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గురువారం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. బుధవారం ఈ బిల్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం పొందింది. దీంతో ఈ రోజు న్యాయ శాఖ ఆర్డినెన్స్ నెం 2 ఆఫ్ 2025 జారీ చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ సెక్రటరీ గొట్టపు ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. మరోపైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గురువారం సచివాలయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయనంద్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఏంవో కార్యాలయంలో..సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర, సిఎం సెక్రటరీ పీఎస్ ప్రద్యుమ్నతోపాటు ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రటరీ ఏవీ రాజమౌళితో మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడానికి సహకరించినందుకు వారికి మంద కృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా అంటే.. ఏప్రిల్ 16వ తేదీన వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాలన్నింటికీ విద్య, ఉద్యోగాల్లో సమాన, న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.