విదేశీ పర్యటనలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కువైట్ పర్యటనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రసీవ్ ఆజాద్ పార్టీ చీఫ్, ఎంపీ గులాం నాబీ ఆజాద్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కువైట్లోని ఆసుపత్రి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని బీజేపీ ఎంపీ బైజయంతి పాండా తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సౌదీ పర్యటనలో ఉండగా ఆయన అనారోగ్యనికి గురి కావడం తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఆయన సహాకారంతో ఇప్పటి వరకు బహ్రెయిన్, కువైట్లలో జరిగిన పర్యటనలు పూర్తిగా ఫలవంతమైనాయని చెప్పారు. అల్జీరియా పర్యటనలో ఆయన లేని లోటు తమ బృందానికి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఎంపీ బైజయంతి పాండా స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట ఎండగట్టే ప్రయత్నాన్ని భారత్ చేపట్టింది. అందులోభాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో ఏడు బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ యా బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి. అందులోభాగంగా బీజేపీ ఎంపీ బైజయంతి పాండా నేతృత్వంలోని ఓ బృందం సౌదీలో పర్యటిస్తుంది. ఆ బృందంలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఇప్పటికే సౌదీలోని పలు ప్రాంతాలను ఈ బృందం పర్యటించిన విషయం విదితమే.
ఇక పర్యటనలో భాగంగా పాకిస్థాన్పై గులాం నబీ ఆజాద్ పదునైన విమర్శలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న ఉగ్రవాదుల కంటే.. పాకిస్థాన్లో అత్యధికంగా ఉగ్రవాదులు నివసిస్తున్నారని తెలిపారు. భారత్లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ తప్పుడు సమాాచారాన్ని వ్యాప్తి చేస్తుందని మండిపడ్డారు. ఇదే ఆ దేశపు నైజమన్నారు. తమ ఈ పర్యటన వల్ల పాక్ ప్రచారం పూర్తి అవాస్తమని అందరికి స్పష్టమైందన్నారు.

