Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీదక్షిణాది రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన IMD ...

దక్షిణాది రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన IMD …

అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడిన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. మే 19 నుంచి 23 వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక, ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. దక్షిణ గుజరాత్‌ వద్ద ఈశాన్య అరేబియా సముద్రంపై సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో వాయు తుఫాను కొనసాగుతుందని IMD తెలిపింది. మే 21 నాటికి కర్ణాటకలో తీరాన్ని దాటే అవకాశం ఉందని.. దీని కారణంగా మే 20 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.
ఇప్పటికే భారీ వర్షాలకు బెంగళూరు నగరం అతలాకుతలం అవుతోంది. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి వ్యవస్థలు ఎక్కడికక్కడ ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వీధులతోపాటు, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. రోడ్డు మీద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్​సమస్యలు తీవ్రంగా మారాయి. భారీ వర్షాలకు బెంగళూరు వాసులు నరకయాతన పడుతున్నారు.
మరోవైపు బెంగళూరుతోపాటు ముంబై, థానే, రాయ్ గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 23 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగానే దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది.
ముఖ్యంగా రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. ఇక ఏపీలోని చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అనకాపల్లి, అన్నమయ్య, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇక తెలంగాణలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అంతేకాక గంటకు 30-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?