గత నెలలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. ఆ ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలోనే అమెరికా జోక్యంతో ఇరు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు కాల్పుల విరమణ అమలు జరుగుతోంది. అయితే ఇవన్నీ జరగకముందు అంటే పహల్గా ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23న భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షా సరిహద్దుల వద్ద పాకిస్తాన్ రేంజర్లకు దొరికిపోయాడు.
గత నెలలో అంతర్జాతీయ సరిహద్దును అనుకోకుండా దాటిన పూర్ణమ్ కుమార్ సాహూను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ అతను పాకిస్తాన్ అదుపులోనే ఉన్నాడు. అతన్ని తమకు అప్పగించాలని భారత్ ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని పాకిస్తాన్ ఇవాళ అనూహ్యంగా అతన్ని అట్టారి చెక్ పోస్ట్ వద్ద భారత జవాన్లకు అప్పగించింది. ఇప్పటివరకూ పాకిస్తాన్ రేంజర్స్ కస్టడీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను అమృత్సర్లోని అట్టారి జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఉదయం 10.30 గంటలకు తమకు అప్పగించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది.
ఈ అప్పగింత శాంతియుతంగా, ఇప్పటికే అమల్లో ఉన్న ప్రోటోకాల్ల ప్రకారం జరిగిందని సరిహద్దు భద్రతా దళం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో అతని కుటుంబం ఊపిరి పీల్చుకుంటోంది. గత నెలలో పెట్రోలింగ్ లో భాగంగా విధుల్లో ఉన్న పూర్ణమ్ కుమార్ పట్టుబడిన తర్వాత వాస్తవానికి ఫ్లాగ్ మీటింగ్స్ ద్వారా ఇరు దేశాల అధికారులు అతన్ని తిరిగి భారత్ కు అప్పగించాల్సి ఉంది. కానీ పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది.
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీకి చెందిన 40 ఏళ్ల పూర్ణమ్ కుమార్ షా పెట్రోలింగ్ లో భాగంగా తుపాకీతో తిరుగుతూ అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు పట్టుబడ్డాడు. దీంతో పూర్ణమ్ విడుదల కోసం అతని కుటుంబం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు కేంద్రానికి పలు వినతులు చేసింది. అయితే తాజాగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సడలడంతో అతని విడుదల జరిగిందని భావిస్తున్నారు.

