SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 30 May 2025, 9:13 am Posted by : SHIVASURYA NEWS

500 నోట్ల కట్టలు కిటికీలో నుంచి విసిరేసినా .. దొరికిపోయాడు

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. అయితే ఈ దాడి జరుగుతుందని ముందే సమాచారం రావడంతో సదరు ఉన్నతాధికారి నగదు కట్టలను కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు.

భువనేశ్వర్, మే 30: తన నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేయనున్నారనే ముందస్తు సమాచారంతో ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తన అపార్ట్‌మెంట్‌‌లోని కిటికీ నుంచి రూ. 500 నోట్ల నగదు కట్లను విసిరేశాడు. అయితే ఏసీబీ అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒడిశా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో బైకుంఠ నాథ్ సారంగి చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో అతడి నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే అతడి బంధువులకు సంబంధించిన నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో మొత్తం రూ. 2.1 కోట్ల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్‌లోని అతని ప్లాట్‌లో రూ. కోటి నగదు స్వాధీనం చేసుకోగా.. మరో రూ. 1.1 కోటి నగదును అతడి బంధువు ఇళ్లలో గుర్తించారు. వీటిని వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే సారంగి నివాసంలో స్వాధీనం చేసుకున్న నగదులో రూ. 500 నోట్లు, రూ. 100, రూ. 200, రూ. 50 నోట్ల కట్టలే అధికంగా ఉన్నాయని అధికారులు చెప్పారు.

సారంగి నివాసంలో సోదాలు జరిపిన బృందంలో 26 మంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది డీఎస్పీలు, 12 మంది ఎస్సైలు, ఆరుగురు ఏఎస్ఐలతోపాటు సిబ్బంది ఉన్నారు.