Saturday, April 11, 2026
Homeజాబ్స్11వేల జాబ్స్.. 1.21కోట్ల దరఖాస్తులు

11వేల జాబ్స్.. 1.21కోట్ల దరఖాస్తులు

ఆర్ ఆర్ బీ, ఎన్టీపీసీ పోస్టులకు డిమాండ్

నిరుద్యోగ భారతానికి నిదర్శనం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు .. 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్ టీ పీసీ పోస్టుల భర్తీకి గతేడాది ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు గతేడాదే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు రాత పరీక్ష తేదీలను అధికారికంగా విడుదల చేయలేదు. తాజాగా ఈ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల వివరాలను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. రైల్వేలో ఇచ్చింది తక్కువ పోస్టులే అయినప్పటికీ ఈ పరీక్ష దేశంలోని అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లలో ఒకటిగా మారనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతేడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2024 వరకు దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. కేవలం 11 వేల పోస్టులకు దేశ వ్యాప్తంగా ఏకంగా 1.21 కోట్ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు మరి. భారతీయ రైల్వేలోని వివిధ జోన్‌లలో ఎన్ టీ పీసీ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ కు ఇంత భారీ సంఖ్యలో కనీవినని రీతిలో దరఖాస్తులు రావడం విశేషం. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగితకు ఇదొక ఉదాహరణ మాత్రమే. మన నేతలు మాత్రం యువతకు ఉపాధి చూపడం, దేశ భవిష్యత్తుకు బాటలు వేయడం మర్చిపోయి.. ఎందుకూ ఒరగని వాటిపై లక్షల కోట్లు కుమ్మరిస్తుండటం విడ్డూరం.. వింతలకే వింత..! ఇక ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పోస్టులకు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులు ఇద్దరూ పోటీపడే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయితే తాజాగా ఆర్‌ఆర్‌బీ ఈ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో ఆన్‌లైన్‌ రాత పరీక్ష సీబీటీ1 నిర్వహించనున్నట్లు షెడ్యూల్ చేసింది. పరీక్ష తేదీకి 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అధికారిక అడ్మిట్ కార్డులు షెడ్యూల్ చేసిన పరీక్షకు నాలుగు రోజుల ముందు విడుదల చేస్తామని వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తుదారులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ని నమోదు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇన్ని కోట్ల మందికి దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ప్రతిరోజూ మూడు షిఫ్టులలో జరుగుతుంది. షిఫ్ట్ 1 ఉదయం 9 నుంచి 10:30 వరకు కొనసాగుతుంది. రిపోర్టింగ్ సమయం ఉదయం 7:30 గంటలు. షిఫ్ట్ 2 మధ్యాహ్నం 12:45 నుంచి 2:15 వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 11:15 గంటలకు రిపోర్ట్ చేయాలి. షిఫ్ట్ 3 సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు నిర్వహించనుంది. రిపోర్టింగ్ సమయం మధ్యాహ్నం 3 గంటలు. సీబీటీ 1 పరీక్ష 90 నిమిషాల వ్యవధిలో 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు జరుగుతుంది. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాలకు మూడవ వంతు మార్కును తగ్గిస్తారు. సరైన సమాధానాలకు మార్కు కేటాయిస్తారు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ విభాగాల నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. సీబీటీ 1 , సీబీటీ 2 , ఆ తర్వాత పోస్ట్‌ను బట్టి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది జాబితాను వెల్లడిస్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?