SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 5:51 am Posted by : SHIVASURYA NEWS

హైకోర్టులోనూ చుక్కెదురు

లిక్కర్ స్కామ్ నిందుతలకు నిరాశ

బెయిల్ మంజూరు చేయలేమన్న హైకోర్టు

జయజయహే : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తన సన్నిహితులైన కె. ధనుంజయ రెడ్డి, పి.కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు కొట్టివేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) ఏపీలో జరిగిన రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిది. ఈ కేసులో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును విచారిస్తూ, రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా (ఏ1) గుర్తించింది. అతను ప్రతి నెలా రూ.50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి, ఈ డబ్బును జగన్‌కు చేర్చినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ధనుంజయ రెడ్డి (ఏ31), కృష్ణమోహన్ రెడ్డి (ఏ32), బాలాజీ గోవిందప్ప (ఏ33)లను కూడా నిందితులుగా సిట్ చేర్చింది. ధనుంజయ రెడ్డి నాటి సీఎంఓ కార్యదర్శిగా, కృష్ణమోహన్ రెడ్డి జగన్ ఓఎస్‌డీగా, బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసేవారు. ఈ ముగ్గురూ మద్యం సిండికేట్‌లో కీలక పాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టు భయంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, వారికి అరెస్టు నుంచి రక్షణ కల్పించే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ప్రాసిక్యూషన్ వివరాలు సమర్పించేందుకు సమయం కోరడంతో, ఈ దశలో బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చట్టపరంగా అరెస్టు చేసే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఇది జగన్ బ్యాచ్‌కు ఊహించని షాక్ అని చెప్పవచ్చు.