SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 7:49 am Posted by : SHIVASURYA NEWS

సింహాచలంలకొండ పైన ఘోర విషాదం

సింహాచలం : జయజయహే : – ప్రఖ్యాతి చెందిన సింహాచలం ఆలయంలో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వెలిసిన శ్రీ వరాహలక్ష్మీ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. స్వామివారికి నిర్వహించే వార్షిక చందనోత్సవం వేడుకల సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.సింహాచలం లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రతి సంవత్సరం చందనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో నిజరూప దర్శనం ఇస్తారు. నిజరూప దర్శనం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఏడాది చందనోత్సవానికి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఆలయంలో భద్రతా ఏర్పాట్లు, భక్తుల ప్రవేశ- నిష్క్రమణ మార్గాలు, క్యూ లైన్ నిర్వహణ వ్యవస్థ, ఇతర సౌకర్యాలను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఇతర అధికారులు స్వయంగా పరిశీలించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొండ దిగువన హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో షామియానాలు వేశారు. రూ.300, రూ.1000, రూ.1,500 టిక్కెట్లు ఉన్న భక్తుల కోసం వేర్వేరుగా క్యూ లైన్లకు ఏర్పాటు చేశారు.వాహనాల పార్కింగ్ వ్యూహాన్ని వివరంగా వివరించారు. ఈ 300 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూలైన్‌లో తాజాగా ఈ ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న 20 అడుగుల గోడ కుప్పకూలింది. విశాఖపట్నం జిల్లాలో రాత్రి ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి పోయింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.