SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 June 2025, 10:54 am Posted by : SHIVASURYA NEWS

సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..! జూన్ 12 నుంచే..!

ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు వీలుగా ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 41 వేల పాఠశాలలు, నాలుగు వేల సంక్షేమ హాస్టళ్లలో ఈ నెల 12వ తేదీ నుంచే దీన్ని అమలు చేయబోతోంది. దీంతో పాటు రైతులకు కూడా మేలు చేసే విధంగా మరో నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో మధ్యాహ్న భోజన పథకం రూపురేఖలు మారనున్నాయి.
పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు. జూన్ 12వ తేదీ నుంచి స్కూళ్లు, హాస్టళ్లకు కలిపి మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. దీంతో మధ్యాహ్న భోజన పథకం అమలులో నాణ్యత పెరకబోతోంది
మరోవైపు స్కూల్స్, హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యం విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఏ రైతు అయితే ఈ బియ్యం పండించారో, ఆయన చేతుల మీదుగానే పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. దేశానికి వెన్నెముక రైతు అని, రైతు లేనిదే రాష్ట్రం లేదని, అటువంటి రైతాంగానికి అండగా నిలబడటం ప్రభుత్వంగా తమ బాధ్యతని తెలిపారు. మరోవైపు కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఈ నెల 4వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుపరిపాలనకు ఏడాది పేరుతో ఉదయం మహిళలు రంగవల్లులు వేసి కూటమి విజయాన్ని పండగలా చేసుకుంటారన్నారు. పీడ విరగడై ఏడాది పేరుతో యువత సాయంత్రం దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పండగ చేసుకుంటారన్నారు. ఈ పోస్టర్ ను నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు.