దశల వారీగా రూ.5,001 కోట్ల పెట్టుబడి
2వేలమందికి ఉద్యోగావకాశాలు
లోకేశ్ 20లక్షల ఉద్యోగాల కల్పనలో మరో మైలురాయి
మే 8న శ్రీసిటీలో ఎల్ జి యూనిట్ కు మంత్రి లోకేష్ భూమిపూజ
జయజయహే : రాష్ట్రంలో రాయలసీమలో మరో కీలక ప్రాజెక్టుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం భూమిపూజ చేయనున్నారు. గతంలో లోకేశ్ పాదయాత్ర చేసిన సమయంలో హామీ ఇచ్చిన మేరకు భారీగా ఈ పరిశ్రమ ద్వారా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్ జి ఎలక్ట్రానిక్స్ తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో వచ్చే ఆరేళ్ళ లో వివిధ దశల్లో రూ.5,001 కోట్ల వ్యయంతో తమ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. 2024 సెప్టెంబర్ లో జపాన్ నుండి వచ్చిన ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు, రాయలసీమ ను ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి చేస్తున్న కృషి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తీసుకుంటున్న చర్యల గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించారు. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రంలో తమ యూనిట్ నెలకొల్పేందుకు ఎల్ జి ఎలక్ట్రానిక్స్ ముందుకు వచ్చింది. ఫ్రిజ్ లు , వాషింగ్ మెషిన్లు, ఏసీలు తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు కొత్తగా ఏర్పాటుచేసే యూనిట్ లో తయారవుతాయి. ఎల్ జి సంస్థ తమ ఉత్పత్తులకు అవసరమైన విడి భాగాలను వేరే దేశాల నుండి తీసుకురావడం కాకుండా ఇక్కడే కంప్రెసర్, మోటార్ కంప్రెసర్, హీట్ ఎక్స్ చేంజర్ భాగాలను రాష్ట్రంలోనే తయారు చేయనుంది. శ్రీసిటీలో ఏర్పాటుచేసే యూనిట్, అనుబంధ కంపెనీల ద్వారా రాబోయే ఆరేళ్లలో యువతకు 2వేల ఉద్యోగాలు లభిస్తాయి. రూ.839 కోట్లతో మరో 5 అనుబంధ యూనిట్లు ఆరేళ్లలో ఏర్పాటు కాబోతున్నాయి.

