SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 10:58 am Posted by : SHIVASURYA NEWS

వైఎస్సార్ జిల్లా పేరు కడప గా మార్చేసిన చంద్రబాబు-మహానాడు వేళ కీలక ఉత్తర్వులు..!

కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు, జిల్లాల పేర్లను అధికార పార్టీలు మార్చేస్తున్నాయి. ఇదే క్రమంలో కీలకమైన వైఎస్సార్ జిల్లా పేరును మారుస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు కేబినెట్ జిల్లా పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంది. దీన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంత వరకూ ఈ జిల్లా పేరు కడపగానే ఉండేది. కడప అంటే దేవుని గడప అని అర్ధం. అయితే వైఎస్ మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైెఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చింది. దివంగత ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆయనకు నివాళిగా అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా ఇదే పేరు కొనసాగించింది.
కానీ వైసీపీ అధికారంలోకి రాగానే కడప జిల్లా పేరులో ఉన్న వైఎస్సార్ ను మాత్రమే ఉంచి కడపను తీసేసింది. దీంతో వైసీపీ హయాంలో ఇది వైఎస్సార్ జిల్లాగానే కొనసాగింది. సెంటిమెంట్ పేరైన కడపను జిల్లా పేరులో నుంచి తీసేయడంపై విమర్శలు వచ్చినా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. దీంతో కేవలం వైఎస్సార్ జిల్లాగానే ఇది ఇప్పటివరకూ కొనసాగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం తాజాగా కేబినెట్ భేటీలో వైఎస్సార్ జిల్లా పేరులో తిరిగి కడపను చేర్చాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఇవాళ వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి వైఎస్ పేరుకు కడపను చేర్చడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రేపటి నుంచి కడపలోనే టీడీపీ మహాానాడు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఇలా జిల్లా పేరును పాత పేరుకు మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది.