విశాఖపట్నం:జయజయహే : 93వ వార్డులో పారిశుద్ధ్య కార్మికుల పనితీరును మెరుగుపరచాలని, రోడ్లు, ప్రధాన కాలువల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని, భూగర్భ మురుగునీటి పారుదల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆయన 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి త్రివేణి వరప్రసాద రావు ( రాపర్తి కన్నా) , జీవీఎంసీ అధికారులతో కలిసి జోన్ 8 లో ,93వ వార్డు నందు కృష్ణానగర్ ,విరాట్ నగర్ ,ప్రహల్ల్లాదపురం తదితర ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేశారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ కృష్ణానగర్ విరాట్ నగర్ ప్రహల్లాదపురం తదితర ప్రాంతాల్లో ఉన్న సమస్యలను మేయర్ కు వివరించగా ,మేయర్ మాట్లాడుతూ పగలు ,రాత్రి పూట విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల విధులలో మార్పులను చేసి వార్డులో నిత్యం పారిశుధ్య పనుల పనితీరును మెరుగుపరచాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ .ఎన్. వి. నరేష్ కుమార్ కు ఆదేశించారు. కృష్ణానగర్ , విరాట్ నగర్ లో ప్రధాన గెడ్డ, కాలువల మరమ్మతులను చేపట్టేందుకు అంచనాలను సిద్ధం చేయాలని, నివాసాలు పెరిగినందున పంచాయతీ కాలం నాటి రోడ్లు అయినందున చాలా చోట్ల రోడ్లు మరమ్మతులకు గురయ్యాయని స్థానికులు కోరగా వాటిని పరిశీలించి రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశిస్తూ,అందుకు స్థానికులు కూడా సహకరించాలని మేయరు తెలిపారు. విరాట్ నగర్ లో గల స్మశాన వాటిక నందు మౌళిక సదుపాయాలను కల్పించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, ప్రహల్లాదపురంలో అసంపూర్ణంగా వున్న యు జి డి పనులను 15 రోజులలో పూర్తి చేసి ప్రతి ఇంటికి కనెక్షన్లను అందించాలని, పలుచోట్ల కాలువలు, కల్వర్ట్ల మరమ్మతులను గమనించి వాటిని పరిశీలించి మూడు రోజుల్లో నివేదికను సమర్పించాలని, సమీపంలోనున్న కమ్యూనిటీ హాల్ నందు మొదటి అంతస్తు నిర్మాణానికి ప్రతిపాదనలు చేపట్టాలని, కోనేరు అభివృద్ధి పనులను ప్రారంభం కాకపోవడం పై ఆరా తీస్తూ 25వ తేదీ నాటికి సంబంధిత కాంట్రాక్టర్ ప్రారంభించనట్లయితే ఆ పనిని రద్దుచేసి కొత్త టెండర్లను పిలవాలని కార్యనిర్వాహక ఇంజనీర్ దిలీప్ ను మేయర్ ఆదేశించారు . అనంతరం వితంతు పింఛను మంజూరు చేయాలని ఒక వితంతువు కోరగా పరిశీలించి వెంటనే పింఛను అందించే ఏర్పాటు చేయాలని ,94 వ వార్డు ఎస్ ఎస్ ఎస్ కొబ్బరి తోట నివాసితులు ఖాళీ స్థలంలో పార్కును మంజూరు చేయాలని వినతి పూర్వకంగా కోరగా వాటిని పరిశీలించి నివేదిక అందించాలని ఎసిపి శాస్త్రికి , జోనల్ కమిషనర్ హేమావతికి మేయర్ సూచించారు. పర్యటనకు హాజరైన సచివాలయాల కార్యదర్శులతో మాట్లాడుతూ సచివాలయాల్లో ప్రజలకు అందించవలసిన సేవలు అసంతృప్తిగా ఉన్నాయని చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని వారిని మేయర్ ఆదేశించారు. వార్డులలో ప్రజలకు కల్పించవలసిన మౌలిక సదుపాయాలలో, అందించవలసిన సంక్షేమ పథకాలలో అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ హేమావతికి మేయర్ సూచించారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజనీర్ సంపత్ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్లు శ్రీధర్ ,మురళీకృష్ణ, సహాయ వైద్యాధికారి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


