SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 9:00 am Posted by : SHIVASURYA NEWS

వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. అర్థరాత్రి ఆస్పత్రికి తరలింపు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోస సమస్య తలెత్తడంతో ఆయన్ను హుటాహుటిన కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంకిపాడు ఆస్పత్రికి వంశీ సతీమణి పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎయిమ్స్ కు తరలించాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ శుక్రవారం అర్ధరాత్రి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయన్ను పోలీసులు వెంటనే కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసు­కున్న వంశీ సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని వెంటనే కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.
వంశీ ఆరోగ్యంపై పేర్ని నాని వైద్యులతో మాట్లాడారు. వంశీని ఎయిమ్స్ కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ మేరకు వంశీ సతీమణి పంకజ శ్రీకు ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవల కూడా వంశీని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్‌ ఎనలైజర్‌ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు. తాజాగా మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు.
బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ప్రస్తుతం వల్లభనేని వంశీ ఉన్న విషయం తెలిసిందే.