SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 5:45 am Posted by : SHIVASURYA NEWS

వన్ టౌన్ లో మాక్ డ్రిల్ నేడు

క్వీన్ మేరీ పాఠశాల వద్ద నిర్వహణ

ఎమర్జెన్సీ టైమ్ లో అప్రమత్తతపై అవగాహన

అధికారులతో సమీక్షించిన కలెక్టర్

జయజయహే : అత్యవసర సమయాల్లో పౌరులు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించి, వారిని సమాయత్తపరిచేందుకు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు బుధవారం ఈ కసరత్తు జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, మాక్ డ్రిల్ సన్నద్ధతపై మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై వారికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ డ్రిల్‌లో భాగంగా నగరంలో ఒకటవ పట్టణ పరిధి క్వీన్ మేరీ పాఠశాల పరిసరాలలో సాయంత్రం 4 గంటలకు ఈ మాక్ డ్రిల్ నిర్వహింనున్నారు. ఇందులో భాగంగా యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తారు. సైరన్ మోతలు, కరెంటు నిలిపివేత, పౌరుల తరలింపు వంటివి చేయనున్నారని తెలిపారు. యుద్ధం జరిగితే ఎలా తమను తాము రక్షించుకోవాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కసరత్తులో భాగంగా ప్రజలకు శిక్షణ, అవగాహన కల్పించడంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. వైమానిక దాడి హెచ్చరిక సైరన్ మోగినప్పుడు ఎలా పౌరులు స్పందించాలి, విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు (బ్లాక్ అవుట్) తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స కోసం ఇళ్లలో ఉంచుకోవాల్సిన అత్యవసర వస్తువులు, మందుల గురించి ప్రజలకు వివరించాలని సమావేశంలో సూచించారు. శత్రుదాడుల సమయంలో పౌరులు, విద్యార్థులకు స్వీయ రక్షణలో శిక్షణ ఇవ్వడం, క్రాష్ బ్లాక్ అవుట్ చర్యలను అమలు చేయడం, కీలకమైన మౌలిక సదుపాయాలను ముందస్తుగా మభ్యపెట్టడం ప్రారంభించడం, యుద్ధ సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే ప్రణాళికలను నవీకరించడం, రిహార్సల్ చేయడం ఈ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశాలని పేర్కొన్నారు