పార్లమెంట్ ఆమోదించిన వివాదాస్పద వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. గతంలో జరిగిన విచారణలో అప్పటి ఛీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా వక్ఫ్ చట్టంలో మూడు క్లాజ్ ల అమలును తాత్కాలికంగా నిలిపేశారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించడంతో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. తదుపరి విచారణలో దీన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే తాజాగా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన బీఆర్ గవాయ్ మరో న్యాయమూర్తి జస్టిస్ ఆగస్టీన్ జార్జి మాసిహ్ తో కలిసి ఇవాళ ఈ పిటిషన్లపై విచారణ జరిపారు.
ఈ సందర్భంగా వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. కేంద్రం వక్ప్ ఆస్తుల్ని లాక్కోవాలనే దురుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. చట్టంలో పేర్కొన్న వివాదాస్పద అంశాల్ని ప్రస్తావిస్తూ గత విచారణలో సుప్రీంకోర్టు వీటి అమలును నిలిపేసిందన్నారు. ఇప్పుడు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై సీజేఐ బీఆర్ గవాయ్ స్పందించారు.
ఇది రాజ్యాంగ బద్ధతకు సంబంధించిన అంశమని, ఇందులో హేతుబద్దమైన కారణం ఉందని చూపించగలిగితే తప్ప సాధారణంగా ఇలాంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని సీజేఐ గవాయ్ తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉన్న వక్ఫ్ ఆస్తుల విషయంలోనూ చాలా వివాదాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అనంతరం వాదనలు వినిపించిన కపిల్ సిబల్.. గతంల ఉన్న వక్ఫ్ చట్టం రక్షిత స్మారక చిహ్నాల స్వభావాన్ని కాపాడిందని తెలిపారు. కొత్త చట్టం ఆ రక్షణలను క్షీణింపజేస్తుందన్నారు. తద్వారా మైనారిటీల హక్కులను ఉల్లంఘిస్తుందని సిబల్ వాదించారు. అయితే దీనిపై ఇవాళ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు వెలువడలేదు.

