జయజయహే : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ బిల్లుపై వచ్చిన 75 పిటిషన్లు పరిశీలించి మే 5వ తేదీ వరకు వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి స్వాగతించారు. రాజ్యాంగం పేర్కొన్న లౌకికవాదాన్ని ఈ తీర్పు రక్షిస్తుందన్నారు. అధికార పార్టీలకు కీలుబొమ్మలుగా మారిన అధికార యంత్రాంగం చేతులో వక్ఫ్ ఆస్తులు పెట్టడం దారుణం అన్నారు. వక్ఫ్ బోర్డులో కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని నూతన నియామకాలను చేపట్టారాదని సుప్రీంకోర్టు పేర్కొనడం అభినందనీయమన్నారు. తదుపరి విచారణ చేపట్టే వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయరాదని తెలపటం సముచిత నిర్ణయం అన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులను నియమించాలనే భావన లౌకికవాదానికి పెను ప్రమాదం అన్నారు. ఆఘ మేఘాల మీద లోక్ సభలో 56 ఓట్ల మెజారిటీతో, రాజ్యసభలో 33 ఓట్ల మెజారిటీతో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింప చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 5న రాష్ట్రపతి ఆమోద ముద్ర పొంది త్వరలో వెంటనే అమల్లోకి తీసుకు రావాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపట్టు అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.