SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 11:10 am Posted by : SHIVASURYA NEWS

లోకేష్ కు ప్రమోషన్…

జయజయహే : ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కానుంది. ఈ సమయంలో పాలనా – పార్టీ పరంగా నిర్ణయాల వేగం పెంచాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో పార్టీ మహానాడుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే లోకేష్ కు ప్రమోషన్ అంశం తెర మీదకు వచ్చింది. లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. దీంతో.. ఈ పరిణామాలు మరింత ఆసక్తిగా మారాయి.
ప్రధాని తో భేటీ: ఏపీ మంత్రి నారా లోకేష్ రేపు (శనివారం) ఢిల్లీ వెళ్లనున్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ కు ప్రధాని అపాయింట్మెంట్  ఖరారైనట్లు సమాచారం రావటంతో వెంటనే హైదరాబాద్ చేరుకుంటున్నారు. రేపు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ పర్యటన కు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ తనను కలవాల్సిందిగా లోకేష్ కు సూచించారు. తాజాగా ఆపరేషన్ సింధూర్ తరువాత లోకేష్ అపాయింట్మెంట్  కోరారు. కాగా, రేపు ఈ మేరకు లోకేష్ కు అపాయింట్మెంట్  ఖరారైంది. ఈ పర్యటన సమయంలో ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రజల మూడ్.. ఎన్డీఏ పాలన.. ఏపీలో ఏడాది కూటమి పాలన గురించి చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానికి ఏపీ తరపున అభినందనలు తెలపనున్నారు. లోకేష్ కు పార్టీలో – ప్రభుత్వంలో ప్రమోషన్ గురించి చర్చ జరుగుతోంది. కొద్ది నెలల క్రితం పవన్ తో సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నేతలు ఓపెన్ గా చేసిన వ్యాఖ్య లు రాజకీయంగా చర్చగా మారాయి. పవన్ అభిమానులు ఈ ప్రతిపాదన పైన ఘాటుగా స్పందిస్తూ పోస్టింగ్స్ పెట్టటంతో వివాదంగా మారింది. ఆ తరువాత ఈ వ్యవహారం పైన ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధినాయకత్వం ఆదేశించటంతో వివాదం ముగిసింది. ఇక, ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో టీడీపీ మహానాడు జరగ నుంది. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటూ తీర్మానం ప్రతిపాదించి.. ఆమోదించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ – ప్రభుత్వంలో లోకేష్ ఇప్పటికే ప్రభుత్వం లో దాదాపు నెంబర్ టూ స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకం గా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనూ సీట్ల ఖరారు.. మంత్రివర్గ కూర్పు.. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేష్ పాత్ర కీలకంగా మారిందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో.. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి గురించి మహానాడు వేదికగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పార్టీ పదవుల విషయంలోనూ ఎవరూ రెండు సార్లు కంటే ఎక్కువగా ఒకే పదవి లో కొనసాగ కూడదనే లోకేష్ ప్రతిపాదనకు పార్టీ పాలిట్ బ్యూరో ఆమోద ముద్ర వేసింది. దీంతో, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని తో భేటీ.. పార్టీ మహానాడు లో లోకేష్ పదవి పైన జరిగే నిర్ణయాల పైన టీడీపీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది.