SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 5:51 am Posted by : SHIVASURYA NEWS

లక్షన్నరకు గోల్డ్ రేట్..?

ఈ ఏడాది చివర నాటికి చేరిక

బ్రోకరేజ్ సంస్థల అంచనా

జయజయహే : 2025 సంవత్సరంలో బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. అక్షయ తృతీయకు ముందే బంగారం 1 లక్ష రూపాయలకుపైగా చేరుకుంది. రానున్న సంవత్సరాల్లో కూడా బంగారం ధరలు పెరగడానికి అవకాశం ఉంది. జేపీ మోర్గాన్ బ్యాంక్ అంచనా ప్రకారం 2026 నాటికి బంగారం ఔన్స్‌ 4,000 డాలర్లు కు చేరుకోవచ్చు. అదే సమయంలో, మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, యార్డెనీ రీసెర్చ్ ప్రెసిడెంట్ ఎడ్ యార్డెనీ అభిప్రాయం ప్రకారం ప్రతి ఔన్స్‌ 4,000 డాలర్లు బంగారం 2025 నాటికే చేరుకుంటుంది. 2026లో బంగారం ఔన్స్‌ 5,000 డాలర్లు కూడా దాటవచ్చు. ఈ లెక్కన చూస్తే, ఈ ఏడాది బంగారం 1,35,000 రూపాయలు 2026లో 1,53,000 రూపాయలు 10 గ్రాములకు చేరుకోవచ్చు. గ్లోబల్ బ్రోకరేజ్ ఫర్మ్ గోల్డ్‌మన్ సాక్స్ కూడా 2025 చివరి నాటికి బంగారం ఔన్స్‌ 3,700 డాలర్లుకు పెరగవచ్చని అంచనా వేసింది. అదే సమయంలో, తదుపరి సంవత్సరం చివరి నాటికి ఔన్స్‌ 4,500 డాలర్లుకు చేరుకోవచ్చు. జేపీ మోర్గాన్ చేసిన అంచనాల ప్రధాన కారణం, పెట్టుబడిదారులతోపాటు కేంద్ర బ్యాంకుల నుంచి కూడా బంగారం కొనుగోలు బలంగా ఉంటుందని చెబుతున్నారు. బ్యాంక్ అంచనా ప్రకారం, ఈ ఏడాది ప్రతి త్రైమాసికంలో స్వచ్ఛమైన బంగారం డిమాండ్ సగటున 710 టన్నుల సమీపంలో ఉంటుంది. అయితే, కేంద్ర బ్యాంకుల నుంచి బంగారం డిమాండ్ బలహీనపడితే లేదా టారిఫ్ షాక్‌ల నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకుంటే, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ చెబుతోంది. వెండి విషయంలో జేపీ మోర్గాన్ 2025 రెండో సగంలో వెండి ధరల్లో మెరుగుదల కనిపిస్తుందని, సంవత్సరం చివరి నాటికి ఔన్స్‌ 39 డాలర్లు కు చేరుకోవచ్చని అంచనా వేసింది.