SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 1:39 am Posted by : SHIVASURYA NEWS

యోగాంధ్రప్రదేశ్ భేష్‌..ప్రధాని మోడీ

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ అనే యోగా అభియాన్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణలో మహిళలు డ్రోన్‌ ఆపరేట్‌ చేస్తూ వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు.

యోగా మన జీవన విధానాన్ని మారుస్తుందని.. ప్రజలంతా దానిని అనుసరించాలని ప్రధాని పిలుపిచ్చారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 లక్షల మంది యోగా ప్రాక్టీషనర్స్‌ను సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘యోగాంధ్ర’ అభియాన్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యోగా సంస్కృతిని అభివృద్థి చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఆ రోజు తాను విశాఖ వెళ్తున్నానని, అక్కడ జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించిందని తెలిపారు. విశాఖపట్నం, గురుగ్రామ్‌ వంటి నగరాల్లో కొన్ని స్టార్ట్‌పలు పేపర్‌ రీసైక్లింగ్‌లో వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిచినప్పుడు మార్పు సాధ్యమేనని తెలంగాణలోని సంగారెడ్డి మహిళలు నిరూపిస్తున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొంతకాలం కిందటి వరకు ఇతరులపై ఆధారపడ్డ మహిళలు ఇప్పుడు స్వయంగా డ్రోన్లను ఆపరేట్‌ చేస్తూ 50 ఎకరాల భూమిలో మందులను పిచికారీ చేస్తున్నారని అన్నారు. వారు ’డ్రోన్‌ ఆపరేటర్లు’గా కాదు.. ’స్కై వారియర్స్‌’గా గుర్తింపు పొందారని కితాబిచ్చారు. ఉదయం మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలు పని చేస్తూ మహిళలు మందుల పిచికారీ పని పూర్తి చేస్తున్నారని తెలిపారు.