దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ లు
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు
ఇప్పటికే జమ్మూకాశ్మీర్ లో నిర్వహణ
జయజయహే : భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల్లో మాక్ డ్రిల్లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం మే 7, 2025న ప్రజా రక్షణ కోసం సమర్థవంతంగా మాక్ డ్రిల్లు నిర్వహించాలని ఆదేశించింది. సివిల్ మాక్ డ్రిల్ అంటే పౌర రక్షణ లేదా విపత్తు నిర్వహణ సందర్భాలలో నిర్వహించే ఒక ఎక్సర్సైజ్. దీనిలో వివిధ సంస్థలు, వ్యవస్థలు, సాధారణ పౌరులు కూడా పాల్గొంటారు. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఇందులో చూపిస్తారు. ఈ అత్యవసర పరిస్థితులు యుద్ధం మాత్రమే కాదు.. భూకంపం, వరద, ఉగ్రవాద దాడి, రసాయన లీకేజ్ వంటి విపత్కర సమయాల్లోనూ ఎదుర్కోవడానికి సన్నద్ధతగా ఉంటాయి. ఈ డ్రిల్లు వాస్తవ పరిస్థితుల్లో ఎలా ఉంటాయో అలా చేస్తారు. ప్రజలు , సంస్థలు తమ ప్రతిస్పందన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, లోటుపాట్లను గుర్తించడానికి ఈ డ్రిల్స్ ఉపయోగపడతాయి. ఒక వాస్తవ విపత్తు లేదా అత్యవసర పరిస్థితి నిజంగా వస్తే ఎలా వ్యవహరిస్తారో అలా వ్యవహరిస్తారు. భూకంపం వచ్చినట్లుగా ఊహించుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. సాధారణంగా ఈ డ్రిల్లలో పోలీసులు, అగ్నిమాపక శాఖ, వైద్య సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు , రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు , స్థానిక పరిపాలన, స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులు పాల్గొంటారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షితంగా ఖాళీ చేయడం, గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడం. సమన్వయం , కమ్యూనికేషన్ వ్యవస్థలను పరీక్షించడం, ప్రజలలో విపత్తు సన్నద్ధతపై అవగాహన కల్పించడం, సంస్థల మధ్య సమన్వయ లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దడం వంటివి ఇందులో ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత కాశ్మీర్లో సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ను ఊహించారు, ఇవి ఉగ్రవాద దాడులకు సన్నద్ధతను పెంచడానికి ఉపయోగపడతాయి. ఢిల్లీ, గుజరాత్, మరియు ఈశాన్య రాష్ట్రాలలో ఎన్ డీ ఎం ఏ మెగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

