ప్రధాని మోదీ వడోదర పర్యటన వేళ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో పర్యటనకు వచ్చారు. గుజరాత్లో రెండురోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ వడోదరలో రోడ్షో లో పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. వడోదరలో ప్రధాని మోదీ పాల్గొన్న సింధూర్ సమ్మాన్యాత్రలో కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని పై పూల వర్షం కురిపించారు.
ఆపరేషన్ సింధూర్ తరువాత తన సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. వడోదరలో జరిగిన రోడ్ షో లో ఊహించని రీతిలో ప్రధాని మోదీకి స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో వడోదర ప్రజలు త్రివర్ణ పతాకాలతో భారీగా తరలి వచ్చారు. మోదీ అనుకూల నినాదాల తో హోరెత్తించారు. మోదీకి 30వేల మంది మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కాగా.. సింధూర్ సమ్మాన్యాత్రలో కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ వేళ చోటు చేసుకున్న పరిణామాలు.. సైన్యం సాధించిన విజయాలను ప్రజల కు తెలియ చేసిన సమయంలో సోఫియా ఖురేషీ దేశ ప్రజల మన్ననలను అందుకున్నారు.
ఆమె కుటుంబీకులు అక్కడే స్థిరపడ్డారు. మహిళల సింధూరం కోసం తన కూతురు యుద్ధం చేయడం తనకు గర్వంగా ఉందని సోఫియా తల్లి చెప్పారు. ఇక, ఆపరేషన్ సింధూర్ తరువాత వడోదరకు ప్రధాని వస్తుండటంతో సోఫియా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చారు. మోదీపై కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు పూలవర్షం కురిపించారు. ప్రధాని మోదీ వారికి అభివాదం చేశారు.



