SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 09 May 2025, 5:56 am Posted by : SHIVASURYA NEWS

మే 11 నుంచి మోదకొండమ్మ జాతర

రాష్ట్ర పండుగగా మూడురోజుల నిర్వహణ

తెలంగాణ సమ్మక్క – సారక్క తరహాలో ఏర్పాట్లు

మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి

జయజయహే : గతంలో ఎన్నడూ లేని విధంగా పాడేరులోని మోద కొండమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తామని మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం అమరావతిలో వెల్లడించారు. మే 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజనుల కొంగు బంగారంగా పూజలందుకునే ఈ అమ్మ వారి జాతరను ప్రభుత్వ పండుగగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సారి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ ఇచ్చి మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. గిరిజన సాంప్రదాయ వంటలు అన్నం, పప్పు, బూరెలు, అరిసెలు, అట్లు నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పారు. తెలంగాణాలో సమ్మక్క, సారలమ్మ తరహాలోని ఆంధ్రప్రదేశ్‌లోనూ మోదకొండమ్మ అమ్మవారి జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాలయం ఒకచోట, అమ్మవారి పాదాలు మరోక చోట ఉండడం ఈ గిరిజన జాతర ప్రత్యేకతలన్నారు. పాడేరు గ్రామ పొలిమేరల్లో అమ్మవారి పాదాలకు పూజ చేశాక జాతరకు రావడం అనవాయితీగా వస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివరించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అమ్మవారి జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ జాతరకు ఒడిశాతోపాటు ఏపీ నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది గిరిజనులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. ఈ జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు గురువారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆహ్వాన పత్రిక అందిజేశారు.