SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 31 May 2025, 9:38 am Posted by : SHIVASURYA NEWS

మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనికోసం మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేసింది.. ఆ షెడ్యూల్‌ ప్రకారం.. జూన్‌ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది.. కాగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది.. ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.. దీంతో ఏపీతో పాటు పొరుగురాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు..

ఇక, జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షల్లో.. ప్రతిరోజు రెండు సెషన్లలో డీఎస్సీ నిర్వహించనున్నారు.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.. అయితే, ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ద్వారా నిర్వహించబోతోంది ఏపీ విద్యాశాఖ..