SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 2:26 pm Posted by : SHIVASURYA NEWS

మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ…. కడప మహానాడులో సీఎం చంద్రబాబు.

రైతులకు ఏటా పెట్టుబడి సాయంగా రూ.20 వేలు అందించే అన్నదాత సుఖీభవ పథకం అమలుపై తాజా అప్‌డేట్ వచ్చింది. కడపలో జరిగిన మహానాడు వేదికగా అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలు చేస్తామనే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పీఎం కిసాన్ యోజన తొలి విడత నగదు పడిన సమయంలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం అందిస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

అన్నదాత సుఖీభవ పథకం అమలు గురించి మరో అప్‍డేట్ వచ్చింది. ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలు చేస్తామనే వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కడప జిల్లా వేదికగా టీడీపీ మహానాడు కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాల గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమలుపైనా కీలక ప్రకటన చేశారు.

రైతులకు పెట్టుబడి సాయంగా ఉండేందుకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో రైతు భరోసా కింద రూ.13500 అందిస్తుండగా.. తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఇస్తామని ప్రకటించారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడానికి ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. పీఎం కిసాన్ యోజన కింద రూ.6000 అందిస్తుండగా.. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14000 కలిపి ఏడాదికి రూ.20000 అందిస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

తాజాగా కడప మహానాడులో అన్నదాత సుఖీభవ పథకం అమలుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించారు. పీఎం కిసాన్ యోజనతో కలిసి అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు రైతులకు అందిస్తామని ప్రకటించారు. ఈ ఏడాదికి సంబంధించి పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే.. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

మరోవైపు అన్నదాత సుఖీభవ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అధికార యంత్రాంగం అర్హులను గుర్తించేపనిలో ఉంది. అర్హుల జాబితా సిద్ధమయ్యాక పీఎం కిసాన్ యోజన నిధులు విడుదలైన సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల కానున్నాయి.