మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్లో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏవోబీలో కీలక నేత కుంజం హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఏకే 47తో పాటు పలు పేలుడు పదార్థాలకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషర్ కగార్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత ఆపరేషన్ కగార్ మరింత దూకుడుగా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్తో పాటు ఏవోబీ ప్రాంతంవైపు కూడా పెద్ద ఎత్తున దృష్టిసారించారు భద్రతా బలగాలు.
ముఖ్యంగా ఒడిశాలో కొన్ని ప్రాంతాల నుంచి భారీగా పేలుడు పదార్థాలును తీసుకువస్తున్నారన్న విశ్వసనీయ వర్గాల సమాచారంలో పక్కా పథకం ప్రకారం హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను దండకారణ్యంవైపు తీసుకెళ్తున్నారంటూ హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఏవోబీకి సంబంధించి ఆపరేషన్ కగార్లో పెద్ద ఎత్తన కీలక నేతలంతా నేలరాలుతున్నారు. గత సంవత్సర కాలంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. అనేమార్లు భద్రతా బలగాలతో మావోయిస్టుల ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
మావోయిస్టు కీలక నేతలు కూడా ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. చాలా కాలంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల వద్ద ఉన్న ఆయుధాలు కూడా పూర్తి స్థాయిలో అడుగంటిన పరిస్థితి. పేలుడు పదార్థాలు, జిలిటెన్ స్టిక్స్, బాంబులకు సంబంధించిన ఎక్స్పోసివ్ మెటీరియల్ మొత్తం మావోయిస్టుల వద్ద అడుగంటినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో పేలుడు పదార్థాలను ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి రవాణా చేస్తున్న సమయంలోనే మావోయిస్టు కీలక నేత హిడ్మాను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు.

