స్కూటీపై వెళ్తుండగా దుర్ఘటన
అక్కడికక్కడే దుర్మరణం
సీతమ్మధార ఏఎంజీ హాస్పిటల్ వద్ద ఘటన
జయజయహే : భారీ ఈదురుగాలులు ఉరుములో మెరుపులతో కూడిన వర్షాలు.. చాలాచోట్ల చెట్లు కూలిపోయాయి హోర్డింగ్లు ఎగిరిపోయాయి. కానీ విశాఖలో.. గాలి వాన ఏమీ లేకుండానే.. ఓ చెట్టు భారీ శబ్దంతో కూలిపోయింది.. ఇంతలో అటుగా స్కూటీ పై వెళుతున్న ఓ మహిళ ప్రాణం తీసింది. మృత్యువు ఏ విధంగా ఎవరిని ఆవహిస్తుందో ఎవరూ ఊహించలేరు. అందరూ భారీ ప్రమాదం నుంచి రేపటిలో తప్పించుకొని ప్రాణాల నుంచి బయట పడే సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. మరికొన్ని ఊహించని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా అనేకం. విశాఖలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. ఇంటి నుంచి బయలుదేరిన ఓ మహిళ.. అనుకోని ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆ కుటుంబాన్ని తీరని విషాదాన్ని నింపింది. విశాఖ సీతమ్మదారలో విషాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళ పై భారీ వృక్షం పడింది. దీంతో పూర్ణిమ (38)అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన వెంటనే ఆమెకు స్థానికులు సీపీఆర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఫలించలేదు. వర్షం, గాలి వాన లేకుండానే చెట్టు కూలడం స్థానికంగా కలకలం రేపింది. ఇదే ఘటనలో రోడ్డుపై వెళ్తున్న మరో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే ట్రాక్టర్ పాక్షికంగా ధ్వంసం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


