SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 31 May 2025, 10:56 am Posted by : SHIVASURYA NEWS

మంత్రి దుర్గేశ్ మాటలు తప్పు.. నటుడు ,దర్శకుడు ,నిర్మాత ,ఆర్ నారాయణ మూర్తి సంచలనం..

  • పవన్ పై కుట్ర చేయలేదు
  • అలా అనడం కరెక్ట్ కాదు
  • సమస్యను పక్కదారి పట్టించొద్దు

ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ సినిమా హరిహర వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేయాలని చూశారంటూ మంత్రి కందుల దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు తప్పు అన్నారు. శనివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘పవన్ కల్యాణ్‌ మీద ఎవరు కుట్ర చేస్తారు. వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పవన్ కల్యాణ్‌ ఆఫీసు నుంచి అలాంటి ప్రకటన వస్తుందని అనుకోలేదు. అది కరెక్ట్ కాదు. పర్సెంటేజీల మీద సినిమాలు రిలీజ్ చేస్తేనే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. అప్పుడు నిర్మాతలకు కూడా మంచి జరుగుతుంది.దాని కోసం థియేటర్ల బంద్ అంశం వచ్చింది. అంతే గానీ పవన్ కల్యాణ్‌ మీద కుట్రతో కాదు. పవన్ కల్యాణ్‌ ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడేందుకు అందరినీ పిలిస్తే ఆయనకు మరింత గౌరవం పెరిగేది. ఇప్పుడు సింగిల్ థియేటర్ల మనుగడ కష్టం అయిపోయింది. నేను కూడా పర్సెంటేజీ విధానమే కోరుకుంటా. చాలా మందికి ఇదే విషయం చెప్పాను. పర్సెంటేజీపై ఇప్పుడు ఓ సమాధానం దొరకుతున్న టైమ్ లో.. వీరమల్లు సినిమాకు లింక్ పెట్టడం సమంజసం కాదు. అలా చేస్తే సమస్యలు పక్కదారి పడుతాయి. సింగిల్ స్కీన్ల విషయంలో అందరం ఆలోచించాలి. అవి లేకపోతే సినిమాకు మనుగడ లేదు.

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చర్యలుండాలి. పర్సెంటేజీని బతికించి ఇండస్ట్రీని బతికించాలి. ఎన్టీఆర్ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి సక్సెస్ అయింది పవన్ కల్యాణ్‌ మాత్రమే. అతనికి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం చాలా సంతోషకరం. ఆయన పర్సెంటేజీ విధానాన్ని అమలు చేసేలా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరు మీద ఇవ్వడం సంతోషం. అందుకే రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇవ్వాలి.

ప్రస్తుతం సినిమా ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రేక్షకులకు చవకగా దొరికే సినిమా ఇప్పుడు ఖరీదు అయిపోయింది. దాని వల్ల కూడా ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు. ఈ ఖర్చులను మనమే తగ్గించాలి. అందుకు అందరం చర్యలు తీసుకోవాలి. పర్సెంటేజీ విధానం తీసుకురావడం వల్ల నిర్మాత, థియేటర్లకు లాభమే. కానీ ప్రేక్షకులను దూరం చేసుకోవడాన్ని కంట్రోల్ చేయాలి’ అని నారాయణ మూర్తి అన్నారు.