ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోలు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి.
మావోయిస్టులకు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతిచెందగా.. చాలామందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ DRG బలగాలు భారీగా పాల్గొన్నాయి. కాగా, ఇవాళ (బుధవారం) ఉదయం నుంచీ భద్రతా బలగాలు, నక్సల్స్కి మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కేశవరావు ఉన్నారు. కాగా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావుపై కోటిన్నర రివార్డు ఉంది. ఈ ఎదురుకాల్పుల్లో కేశవరావుతోపాటు మరికొందరు కీలక నేతలు హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

