SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 12:13 pm Posted by : SHIVASURYA NEWS

బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం – భీమిలి ఎమ్మెల్యే గంటా

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

_విశాఖపట్నం, జయజయహే : సింహాచలం కొండపై గోడ కూలి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఘటనా స్థలంలో.. అలాగే కేజీహెచ్ వద్ద బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. దుర్ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రతినిధులను, ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారన్నారు. సహాయ చర్యలు వేగవంతం చేశామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నామని వెల్లడించారు. గోడ ఇటీవల కాలంలో నిర్మించినదిగా అర్థమవుతుందని, భారీవర్షం వల్ల పడిపోయినట్టుగా తెలుస్తుందన్నారు. నిర్దిష్ట కారణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించిందని చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి సింహాచలం కొండపై జరుగుతున్న నిర్మాణపు పనుల నాణ్యతను గంటా పరిశీలించారు. గోడ కూలిన ప్రాంతాన్ని చూశారు. స్థానిక కార్పొరేటర్ పి.వి. నరసింహం తదితరులు వెంట ఉన్నారు. అనంతరం కేజీహెచ్ దగ్గర మృతుల కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల్లో నలుగురు భీమిలి నియోజకవర్గంలోని చంద్రంపాలెం, మధురవాడకు చెందిన వారన్న విషయం తెలిసిందే.