SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 7:42 am Posted by : SHIVASURYA NEWS

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు రైతు కూలీలు మృతి ఏడుగురు పరిస్థితి విషమం…

జయజయహే : పల్నాడు జిల్లాలో ఈరోజు ( మే 13, 2025 ) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం వినుకొండ మండలం శివాపురం సమీపంలో జరిగింది. పొలం పనులకై వెళ్తుండగా.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన రైతు కూలీలు బొప్పాయి కాయల లోడ్‌తో వెళ్తున్న బొలెరో ట్రాలీలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలోనే ఎదురుగా వస్తున్న మరో లారీ వేగంగా వచ్చి ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాలీ పూర్తిగా ధ్వంసమవ్వగా.. సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. ఆసుపత్రికి తరలించేలోపు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వాపోతున్నారు. అలానే ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని సమీపంలోని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న ఇద్దరిని గుంటూరులోని పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉండగా.. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా క్లియర్ చేశారు. ఘటనలో మృతి చెందిన వారంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గడ్డమీదపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా.. గ్రామస్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి తగిన పరిహారం ఇవ్వాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.