SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 7:15 am Posted by : SHIVASURYA NEWS

పార్టీ పనైపోయిందన్న వారి పనే అయిపోయింది: సీఎం చంద్రబాబు నాయుడు

కడప మహానగరం వేదికగా మహానాడు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జెండా మోస్తున్న కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన పేర్కొన్నారు.

తొలిసారి దేవుని గడప కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సారి మహానాడు చరిత్ర సృష్టించబోతోందని ఆయన స్పష్టం చేశారు. కడప మహానగరం వేదికగా మంగళవారం మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఈ సభలో పార్టీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకుగానూ 7 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు ఆయన సూచించారు

కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని పేర్కొన్నారు. అంతేకాదు.. అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు. ఇక ప్రశ్నించిన కార్యకర్తలను పొట్టన బెట్టుకున్నారని ఆయన తెలిపారు. పసుపు సింహం చంద్రన్నను దారుణంగా చంపారన్నారు. అలాగే ఎంతో మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని వివరించారు. కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీ కార్యకర్తల త్యాగాలను వృథా కానివ్వమని ఈ సందర్భంగా ఆయన కేడర్‌కు భరోసా ఇచ్చారు.

తన పాదయాత్ర నుంచి లోకేష్‌ యువగళం వరకు.. కార్యకర్తల్లో అదే స్ఫూర్తి, అదే పోరాట పటిమ ఉందన్నారు. జెండా మోస్తున్న కార్యకర్తలే.. టీడీపీ బలమని ఆయన అభివర్ణించారు. తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పని చేస్తుందని స్పష్టం చేశారు. పటేల్‌ – పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం తదితర అంశాలు తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైనాయని వివరించారు. అలాగే రూ.2 కిలో బియ్యం, సబ్సిడీ కరెంట్‌ కూడా ఈ పార్టీనే తీసుకు వచ్చిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలు, వర్గాల అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

గతంలో విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పాలన అంటే వేధింపులే అన్నట్లుగా గతంలోని పాలకులు వ్యవహరించారన్నారు. తెలుగుదేశంతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీలను అధికారంలో భాగస్వాములం చేశామన్నారు. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని చెప్పారు. ఇక ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడ్డామని స్పష్టం చేశారు. జవాబుదారీ వ్యవస్థను దేశానికే పరిచయం చేశామన్నారు. భావితరాల భవిష్యత్‌ కోసం కార్యక్రమాలు రూపకల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రం ఫస్ట్‌ అనేదే టీడీపీ నినాదమని ఆయన పేర్కొన్నారు.