ఎత్తిన జెండా దించకుండా, తెలుగుదేశం పార్టీకి కాపలాకాసిన ప్రతీ కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు. కడపలో మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలం, బలగమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు. పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. టీడీపీకి ప్రతిపక్షం కొత్త కాదని.. అధికారం కొత్తకాదన్నారు.
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడ్డామని వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు అవసరమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవమే పార్టీ మూల సిద్ధాంతమని పేర్కొన్నారు. తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలు తీసుకొచ్చామన్నారు మంత్రి లోకేష్. తెలుగు జాతి – విశ్వ ఖ్యాతి, పేదల సేవలో- సోషల్ రీఇంజినీరింగ్, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా, యువగళం, కార్యకర్తే అధినేత ఈ ఆరు శాసనాలు తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చూశామన్నారు. గత వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని మండిపడ్డారు. సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశారన్నారు. సమాజంలో ఆడవాళ్లను చులకనగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. గతంలో ఓ మహిళా మంత్రి తనకు చీర గాజులు పంపారని.. అవమానించిన వారి పరిస్థితి ఏమైంది.. అర్థమైందా రాజా అంటూ మంత్రి లోకేష్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.


