SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 04 May 2025, 5:44 am Posted by : SHIVASURYA NEWS

నేటి నుండి బద్రీనాథుని దర్శనం ఆరంభం

దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్‌లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి- బద్రీనాథ్. దేశం నలుమూలల నుంచి ఏటా లక్షలాదిమంది దర్శించుకుంటుంటారు. బద్రీనాథ్‌తో కలిపి చార్ ధామ్ యాత్రల్లో పాల్గొంటుంటారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరచుకున్నాయి.
ఈ తెల్లవారు జామున సరిగ్గా 6 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బద్రీనాథుడికి తొలి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి 10 వేల మందికి పైగా భక్తులు బద్రీనాథ్ క్షేత్రానికి చేరుకున్నారు.

ఆలయం తలుపులు తెరచుకున్న వెంటనే భక్తులు బద్రీనాథుడికి స్మరించుకున్నారు. జయజయధ్వానాలు చేశారు. ఆలయ ఘంటానాదంతో బద్రీనాథ్ ప్రాంతం మొత్తం పులకించిపోయింది. పండగ వాతావరణం నెలకొంది. ఆలయం, భక్తులపైనా హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారు. ఆర్మీ బ్యాండ్ సంగీతాన్ని వినిపించింది. శనివారం పాండుకేశ్వర్‌లోని యోగా ధ్యాన బద్రీ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆది గురు శంకరాచార్యుల సింహాసనాన్ని ఆలయ ప్రధాన పూజారి రావల్ అమర్‌నాథ్ నంబూద్రి, పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ తప్లియాల్, అర్చకులు.. బద్రీనాథ్ మందిరానికి తీసుకొచ్చారు. ఈ తెల్లవారు జామున ఆలయం తలుపులను తెరిచారు. ఈ సంవత్సరం బద్రీనాథ్ తీర్థయాత్రకు పాలిథిన్‌ను నిషేధించినట్లు బద్రీనాథ్- కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఛమోలి జిల్లా అధికార యంత్రాంగం సైతం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణ ప్రయాగ్, గౌచార్, నందప్రయాగ్, పిప్పల్‌కోటి, జ్యోతిర్మఠ్, గోవింద్‌ఘాట్, పాండుకేశ్వర్‌లలో హోటల్ నిర్వాహకులు తప్పనిసరిగా రేట్ల జాబితాలను ప్రదర్శించాలని ఛమోలీ జిల్లా కలెక్టర్ సందీప్ తివారీ ఆదేశించారు.