SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 6:11 am Posted by : SHIVASURYA NEWS

నేటి నుండి నీడ మాయం

రాజమహేంద్రవరం: జయజయహే : ఖగోళ అద్భుతం వల్ల సోమవారం నుంచి ఈ నెల 14వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్‌ ఆస్టరాయిడ్స్‌ సర్చ్‌ క్యాంపెయిన్‌ (ఐఏఎస్‌సీ) జాతీయ కన్వీనర్‌ మేకా సుసత్యరేఖ ఆదివారం తెలిపారు. ఈ పరిణామాన్ని జీరో షాడోగా వ్యవహరిస్తారని అన్నారు. సాధారణంగా నీడ మనిషికి ఏదో ఒకపక్క కనిపిస్తుందని, సోమవారం నుంచి 14 వరకు మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి మన మీద లంబంగా పడి నీడ మాయమవుతుందని ఆమె వివరించారు. ‘‘భూమి అక్షం 23.5 డిగ్రీలు వంపుగా ఉన్నందున సూర్యుడి చుట్టూ భ్రమణం చేసే సమయంలో సూర్యుని స్థానం ఉత్తర-దక్షిణ దిశల్లో మారుతూ ఉంటుంది. ఏటా రెండు సందర్భాల్లో కర్కాటక, మకరరేఖల మధ్య ఉన్న ప్రదేశాల్లో  మధ్యాహ్నం సమయాల్లో సూర్యకిరణాలు భూమిపై సంపూర్ణ లంబంగా పడతాయి. దీనివల్ల నిలువు వస్తువుల నీడ రెండు నిమిషాల వరకు పూర్తిగా మాయమవుతుంది’’ అని సుసత్యరేఖ చెప్పారు. ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యుని కదలిక, స్థానాన్ని అధ్యయనం చేసేందుకు జీరోషాడో ఎంతగానో ఉపకరిస్తుందని సుసత్యరేఖ తెలిపారు.