నందవరం,శివసూర్య,డిసెంబర్ 25:
నందవరం మండలంలో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన నందవరం
ఎస్సీ కాలనీలో క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉపాధి నిమిత్తం సంవత్సరమంతా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్న కాలనీవాసులు క్రిస్మస్ పండుగ సందర్భంగా స్వగ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు, యువకులు, చిన్నారులు రంగురంగుల విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసి చర్చిలో సాయంత్రం పెద్ద సంఖ్యలో యువత పాల్గొని క్రిస్మస్ భక్తిగీతాలు ఆలపిస్తూ దేవునిని ఘనంగా స్తుతించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి పాస్టర్ బి. ఎన్. ప్రసాద్ యేసు క్రీస్తు పుట్టుక ప్రాముఖ్యతను వివరిస్తూ, యేసు ప్రభువు చూపిన ప్రేమ, త్యాగం, క్షమాగుణం, సహనం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో పాటించాలని సందేశం అందించారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యత పెంపొందించడంలో క్రిస్మస్ పండుగ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాణసంచా పేలుస్తూ క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

