Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీతెలంగాణలో రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు – సీఎం రేవంత్ రెడ్డి

నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నుంచి ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పార్టీ నేతలు సహా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచే.. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. ఆ దిశగా అధికారులకు సూచనలు చేశానని చెప్పారు. సభా వేదిక నుంచి నల్లమల్ల డిక్లరేషన్‌ను, మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్‌తో ఆదివాసీలు, బంజారాలు, చెంచులకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది.
గిరిజన సంక్షేమానికి రూ.12,600 కోట్లు పనులు చేపట్టనున్నారు. నల్లమల్ల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అవసరమని, గతంలో పోడు భూములు పోరు భూములుగా మారాయని, ఇప్పుడు వాటిని వ్యవసాయ యోగ్యంగా మారుస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది అంటూ ఎద్దేవా చేశారు. పోడు భూముల్లో సోలార్ పంపుసెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిది అని కొనియాడారు. ప్రస్తుతం వ్యవసాయంలో ఉపయోగిస్తున్న కరెంట్ పంప్ సెట్ల స్థానంలో 100 రోజుల వ్యవధిలో సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే నూటికి నూరు శాతం ఖర్చును భరిస్తుందని చెప్పారు. రైతులకు 5 హెచ్‌పీ , 7.5 హెచ్‌పీ సామర్థ్యం గల సోలార్ పంప్ సెట్లు ఉచితంగా అందిస్తామన్నారు. వ్యవసాయ అవసరాలకు వినియోగించిన తరువాత మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వం సేకరించి.. ఆ విలువను మహిళా రైతుల ఖాతాల్లో ప్రతి నెల జమ చేస్తుందని వివరించారు. ఈ విధంగా ప్రతి రైతు నెలకు రూ. 3 వేల నుంచి 5 వేల వరకు అదనంగా సంపాదించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 60 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేసిందని గుర్తు చేశారు. సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ అందిస్తున్నామని రేవంత్ తెలిపారు. వరి వేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి వరి వేస్తే సిరి అనే పరిస్థితులు కల్పించామని స్పష్టం చేశారు. పేదలందరికీ సన్న బియ్యం అందించి వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది పేదలకు సన్న బియ్యం.. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు సీఎం. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని.. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని వివరించారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని వెల్లడించారు. పాలమూరోల్లకు పాలన చేతకాదన్న వాళ్లకు.. తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టగలమని నిరూపించామన్నారు. ఎంతోమంది ప్రధానులు అయినా…. ప్రతీ తండాలో.. పేదవాడి గుండెల్లో నిలిచిపోయింది మాత్రం ఇందిరమ్మ మాత్రమేనని కొనియాడారు.
మరోవైపు ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పేరు పలకటానికి కష్టంగా ఉందని.. పథకం పేరను “ఇందిర సోలార్ గిరి జల వికాసం”గా మార్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను విజ్ఞప్తి చేశారు. సౌర అనే బదులు సోలార్ అని పెడితే మా వాళ్లకు అల్కక అర్థమైతది అంటూ సీఎం రేవంత్ చెప్పారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?