SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 7:22 am Posted by : SHIVASURYA NEWS

జనసేన సైనికుల దెబ్బకు మారిన ఆహ్వాన పత్రిక…

మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా ఏర్పాట్లు చేస్తోంది. భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అయితే, ఈ భారీ ఈవెంట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికలో పవన్ పేరు లేకపోవటం పైన జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో, ప్రభుత్వం ఆహ్వాన పత్రికలో మార్పు చేసింది. పవన్ పేరును జత చేస్తూ కొత్తగా ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తోంది.
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ మే నెల 2న శంకుస్థాపన చేయను న్నారు. అమరావతి రైతులకు బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పేరు మాత్రమే ఉండడం వివాదంగా మారింది. పవన్ పేరు ఎందుకు లేదని జనసైనికులు నిలదీసారు. సోషల్ మీడియాలో ఇది పవన్ ను తగ్గించటమేనని పోస్టింగ్స్ కనిపించాయి. అమరావతికి మద్దతుగా పవన్ తొలి నుంచి నిలిచిన విషయాన్ని జనసైనికులు గుర్తు చేసారు. ప్రభుత్వంలో.. కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కు గౌరవం ఇచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని జనసైనికులు డిమాండ్ చేసారు. కూటమి అధికారంలోకి రావటానికి పవన్ కీలకమనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో, అమరావతి వేడుక ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వేళ ఈ వివాదానికి ముగింపు పలికేలా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం ముద్రించిన రాజధాని అమరావతి ఆహ్వాన పత్రిక మారింది. రాష్ట్రప్రభుత్వం పవన్‌ కళ్యాణ్‌ పేరుతో మరోసారి ఆహ్వాన పత్రికలను ముద్రించింది. ప్రధాని మోదీ, చంద్రబాబుతో పాటుగా పవన్ పేరుతో కొత్తగా ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నారు. దీంతో, పవన్ అభిమానులు శాంతించారు. ఇక.. ప్రధాని పాల్గొనే సభ కోసం అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే కూటమిలోని మూడు పార్టీల నేతలతో సీఎం చంద్రబాబు ఈ సభ పైన సమీక్ష చేసారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా సభను సక్సెస్ చేయాలని నిర్దేశించారు.