అమరావతి: జయజయహే : జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు సంతాప దినాలను జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందులో భాగంగా పార్టీ జెండాను 3 రోజులు హాఫ్-మాస్ట్ (సగం కిందకు దించడం) చేసి ఉంచాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాలని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.’పౌర సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదు. అందరూ కలిసికట్టుగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయాలి” అని పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానవీయమని, ఎంతమాత్రం సహించరాదని అన్నారు. శాంతికి జనసేన కట్టుబడి ఉందని, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలు, బాధిత కుటుంబాలకు “మానవహారం”గా ఏర్పడి సంఘీభావం తెలపాలని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ కోరారు.
తీవ్రంగా కలిచివేసింది
పహల్గాం ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తు్న్నానని పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. ఉగ్రవాద దుశ్చర్యలతో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇరువురి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం భరోసా నిలుస్తుందని చెప్పారు. భారతదేశ ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నంచేయలేదని, అందరూ ఏకతాటిపై నిలిచి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

