SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 5:13 am Posted by : SHIVASURYA NEWS

చంపినా తగ్గేదేలా..!

పెహల్గామ్ కు తగ్గని రద్దీ

జయజయహే : ఇటీవల పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి ప్రధాన ఉద్దేశం పర్యాటకులను కశ్మీర్‌కు రావద్దని చెప్పడం. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. పహల్గామ్‌లో మళ్లీ టూరిజం సాధారణ స్థాయికి తిరిగి వస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టూరిజం తగ్గిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈ ఎటాక్ తర్వాత కొన్ని రోజులకు ఇక్కడికి వచ్చే పర్యాటకులు పెరగడం విశేషం. గత కొన్ని వారాలుగా అనేక మంది టూరిస్టులు భద్రతను అంగీకరించి ప్రయాణం చేస్తున్నారు. కొన్నిసార్లు అనిశ్చితి వాతావరణం ఉన్న నేపథ్యంలో స్థానికులు, ప్రభుత్వ అధికారులు కూడా పర్యాటకులను సురక్షితంగా ఉంచడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారు.

దీన్ని బట్టి చూస్తే ఇకపై ఎవరూ కశ్మీర్ ప్రాంతానికి రాలేరనే అనుమానాలు చాలా త్వరగా తొలగిపోయాయని చెప్పవచ్చు. ఉగ్రదాడి తరువాత, విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడి సందర్శనకు వచ్చినప్పుడు వారి అనుభవాలను పంచుకున్నారు. కశ్మీర్ ఇప్పుడు చాలా సురక్షితంగా ఉందని కోల్‌కతా నుంచి తాజాగా పహల్గామ్ వెళ్లిన ఓ పర్యాటకుడు అన్నాడు. ప్రతిదీ తెరిచి ఉందని, పర్యాటకులు సురక్షితంగా ఎప్పుడైనా సందర్శించవచ్చని వెల్లడించాడు. గుజరాత్‌ సూరత్‌కు చెందిన మహ్మద్ అనాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు. సైన్యం, ప్రభుత్వం, స్థానికులు మా భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. మేము ఇక్కడ చాలా సురక్షితంగా ఉన్నామని క్రొయేషియాకు చెందిన ఒక మహిళ ఈ ప్రాంతం గురించి చెప్పారు. పహల్గామ్ వంటి ఘటనలు ఎక్కడైనా జరగవచ్చు. ప్రస్తుతం భద్రత పెరిగిందని, ఎలాంటి భయం అనిపించలేదని ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో భద్రతా సవాళ్ల మధ్య కూడా, పహల్గామ్‌లోని పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. దీంతోపాటు స్థానికుల వ్యాపారం కూడా యథావిధిగా కొనసాగుతోంది. కొంత కాలమైతే టూరిజం మరింత పెరిగే ఛాన్సుంది. అనేక మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసకరమైన ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లోయ క్రమంగా సాధారణ స్థితికి తిరిగి వస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి పరిణామం కశ్మీర్ టూరిజం సహా ఇండియాకు కూడా మంచి విషయమని చెప్పవచ్చు.