SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 6:02 am Posted by : SHIVASURYA NEWS

గాలివాన బీభత్సం

పిడుగులు పడి ఏడుగురు, చెట్టు కూలి ఒకరు మృతి

తడిసిన ధాన్యం.. ఉద్యాన పంటలకు భారీనష్టం

అమరావతి: జయజయహే తెల్లారడమే ఆలస్యం.. ఉరుములు, పిడుగుల మోత.. ఆపై గంటకు 60 నుంచి 80 కి.మీ.కు పైగా వేగంతో ఈదురు గాలులు.. వీటితోపాటే భారీ వర్షం.. ఆదివారం ఉదయం మొదలై రాత్రి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్స వాతావరణం నెలకొంది. గాలుల తీవ్రతకు భారీవృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. సుమారు 50వేలకు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతిని ఉంటుందని అంచనా. కోతకొచ్చిన వరి నేలవాలింది. ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిచిపోయింది. ఈదురుగాలుల ధాటికి వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలకరిచాయి. మొక్కజొన్న రైతులూ నిండా మునిగారు. పిడుగుపాటుతో.. తిరుపతి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. నాయుడుపేట మండలం వద్దగుంట కండ్రిగలో రైతు భాస్కర్(52), ఓజిలి మండలం గొల్లపాలెంలో కార్తీక్(11), చిల్లకూరు మండలం కాకువారిపాలెంలో మునీంద్ర(30) మరణించారు. ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన గొర్రెల కాపరి నాగమల్లేశ్వరరావు(40), బాపట్ల జిల్లా చినగంజాంలో గేదెలు మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య(50) పిడుగు పడటంతో మృతిచెందారు. కృష్ణా జిల్లా శ్రీకాకుళం రేవు నుంచి ద్విచక్రవాహనంపై గాజులంక వెళ్తున్న సుప్రదీప్(23) పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. చెట్టు పడటంతో ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో పదేళ్ల బాలుడు మామిడి బాలగోవిందు అక్కడికక్కడే మృతి చెందాడు. పిడుగుపాటుకు గురై మండవల్లి మండలం చింతపాడు శివారు దెయ్యంపాడులో రైతు సైదు గిరిబాబు (33) చనిపోయాడు. తిరుపతిలోని సంస్కృతినగర్లో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తూ.. జూనియర్ లైన్మెన్ విద్యుదాఘాతానికి గురయ్యారు.