SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 5:37 am Posted by : SHIVASURYA NEWS

గవర్నర్ నజీర్ కు అవమానం

జయజయహే : రాష్ట్ర ప్రధమ పౌరుడు అబ్దుల్ నజీర్‌ను రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ అవమానించారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో నూతన సీజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు. ఢిల్లీకి గవర్నర్ వచ్చిన వెంటనే ఆయన్ని కలవక పోగా.. ఇప్పటి వరకు గవర్నర్‌ను రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ మర్యాద పూర్వకంగా కూడా కలవక పోవడం గమనార్హం. దేశ రాజధాని న్యూఢిల్లీకి రాష్ట్ర గవర్నర్ కానీ, ముఖ్యమంత్రి కానీ వస్తే.. ప్రోటోకాల్ ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. వారికి తప్పనిసరిగా రెసిడెంట్ కమిషనర్ స్వాగతం పలకాల్సి ఉంది. గవర్నర్ అబ్దుల్ నజీర్.. న్యూఢిల్లీకి వచ్చి దాదాపు 24 గంటలు గడిచినా.. ఆయనకు ఈ రెసిడెంట్ కమిషనర్ కలవక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ప్రోటోకాల్ ఉల్లంఘనకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ పాల్పడినట్లు విమర్శలు జోరందుకొన్నాయి. లవ్ అగర్వాల్ వ్యవహారంపై ఏపీ భవన్ వర్గాలుతోపాటు గవర్నర్ సిబ్బంది సైతం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్.. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం డిప్యూటేషన్‌పై ఆయన కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లారు. కరోనా సమయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పని చేశారు. ఈ డిప్యూటేషన్ పూర్తయిన అనంతరం ఆయన ఏపీకి వచ్చారు. ఈ క్రమంలో ఏపీ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రభుత్వం ఆయన్ని నియమించింది. మరోవైపు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఢిల్లీ వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ని కలవకపోవడంపై ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌ను ప్రభుత్వం వివరణ కోరినట్లు తెలుస్తోంది.